ప్రహరీ నిర్మించి..పార్కు నిర్మాణం మరిచారు
ఏండ్లు కావస్తున్నా పూర్తి కాని పనులు
ఫాక్స్సాగర్ చెరువు కట్టకింద పార్కు పూర్తయ్యేదెన్నడో..?
ఎకరం 10 గుంటల స్థలం…
రూ.1.50 కోట్ల నిధులు మంజూరు
కుత్బుల్లాపూర్,మే29: నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా కోట్లు విలువ చేసే స్థలాలు మాయం అవుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 132 జీడిమెట్ల డివిజన్ ఫాక్స్సాగర్ చెరువు కట్ట కింద సుమారు ఎకరం 10 గుంటల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేరలో పడకుండా ఉండేందుకు ప్రజలకు వినియోగంలో తీసుకొచ్చేలా పార్కు నిర్మాణానికి పూనుకున్నారు. అందు కోసం దాదాపుగా సుమారు రెండేండ్ల క్రితం రూ. 1.50 కోట్ల మోడల్ పార్కు నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించారు.
తదానంతరం పనులను జీహెచ్ఎంసీ సంబంధిత కాంట్రాక్టర్కు అప్పగించింది. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. చురుగ్గా పనులు సాగితే ఏడాదిలోపే పార్కు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండేది. కానీ ఏండ్లు కావస్తున్నా పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం చుట్టు పక్కల వెంచర్లు, ఇతర బహుళ అంతస్తు నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో ఖాళీగా ఉన్న పార్కు స్థలంపై కొంతమంది కన్ను పడింది. ఇప్పటికే పార్కు కోసం నిర్మించిన ప్రహరీకి ఆనుకొని ఇతర వ్యక్తి ఈ స్థలం తమదేంటూ బహిర్గతంగా పేర్లు రాసుకోవడంతో స్థానికులకు పలు అనుమానాలకు రేకత్తింపజేస్తున్నాయి.
తీరొక్క ఆటలకు నెలవుగా…
రద్దీగా మారుతున్న రోడ్లు, కాలనీల్లో ప్రజలకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయమానికి, ఆటలకు నెలవుగా ఉండేందుకు ఎకరం 10 గుంటల స్థలాన్ని మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. రూ. 1.50 కోట్లతో సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, బాస్కెట్ బాల్కోర్టు, గ్రీనరీతో పాటు చిన్నపిల్లల ఆటవస్తువులు, ఇతర వ్యాయమ పరికరాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేశారు. పార్కు నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే అవకాశం ఉంది.
నిర్మాణం పూర్తయ్యేదెన్నడో…!
లక్ష్యంతో పార్కు నిర్మాణాన్ని చేపట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. కానీ పనులు నత్తనడకన సాగడంతో ఎక్కడి పనులు అక్కడే దర్శనమిస్తున్నాయి. పార్కు స్థలం చుట్టూ ప్రహరీని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఆ ప్రహరీకి ఆనుకొని ఇతర ప్రహరీ పార్కు స్థలంలోనే వెలుస్తుండడంతో పార్కు నిర్మాణం పూర్తయ్యెదెన్నడో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా నిధుల సమస్యతో సంబంధిత గుత్తేదారు పనులు పూర్తిస్థాయి చేపట్టేందుకు ముందుకు రావడం లేదని పలువురు అంటున్నారు.
సకాలంలో పూర్తి చేసేలా చూస్తాం
పార్కు నిర్మాణ పనులు నత్తనడకన సాగేది వాస్తవమే. అనుకున్న స్థాయిలో ఇప్పటికే పూర్తి చేయాలి. అనివార్యకారణాల వల్ల ఆలస్యంగా పనులు సాగుతున్నాయి. త్వరగా పనులు పూర్తి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. పార్కు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.
– సురేందర్నాయక్, ఏఈ కుత్బుల్లాపూర్ సర్కిల్