ఖైరతాబాద్, ఏప్రిల్ 18 : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలఅని కోరుతూ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, టీఎస్ స్కూల్, టెక్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ మథర్స్ అసోసియేషన్, చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు సోమవారం లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల అధ్యక్షులు ఎన్. నారాయణ, ఎ. సంతోష్ కుమార్, జి భాగ్యలక్ష్మి, జి. వేణుగోపాల్లు మాట్లాడుతూ దేశంలోని తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో ఫీజుల నియంత్రణ చట్టాలు అమలవుతున్నాయని, రాష్ట్రంలో ఈ చట్టం అమలు కాకపోవడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, అధిక ఫీజులను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు.