మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 5 : నీటి పంపిణీలో ఎలాంటి ఆటంకం జరుగకుండా చూడాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తాగు నీటి సరఫరా కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేడ్చల్ మండలంలోని ఘన్పూర్ గ్రామ శివారు క్షేత్రగిరిగుట్టపై ఉన్న మిషన్ భగీరథ మేడ్చల్ సెగ్మెంట్ ట్యాపింగ్ పాయింట్ను శుక్రవారం ఆయన ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి సందర్శించారు.
పాయింట్ వద్దకు వస్తున్న నీటి వివరాలు, జలాలను ఎలా పంపిస్తున్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పాయింట్ వద్దకు చేరుకుంటున్న నీటి పంపిణీలో ఎలాంటి ఆటంకం, సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా సమయానుకూలంగా నీటిని పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈ విజయ్ ప్రకాశ్, ఎస్ఈ శ్రీనివాస్ చారీ, ఈఈ నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.