మహేశ్వరం, ఆగస్టు1: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు రైతులు సాగు విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో వెదజల్లే విధానంతో అధికలాభాలు సాధించవచ్చని చేసిన సూచనలు పాటించడానికి రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎక్కువమంది రైతులు తుకం విధానం ద్వారానే పంటలను పండిస్తుండగా వెదజల్లే పద్ధతి వల్ల కలిగే మేలుపై అవగాహన పెంచడంతో పంట మార్పిడికి చర్యలు తీసుకుంటున్నారు. తుకం ఏర్పాటు చేసి నెలపాటు ఆ నారుమడిని కాపాడి సమయం వృథా చేయడం కన్నా వెదజల్లే పద్ధతిలో వరి పనులను వేసుకుంటున్నారు. ఈ విధానంలో శ్రమతో పాటు ఖర్చు తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా ఉంటుందని రైతన్నలు పేర్కొన్నారు. మహేశ్వరం మండలం పరిధిలోని గట్పల్లి, రావిరాల తదితర అనేక గ్రామాల్లో వెదజల్లే పద్ధతివైపు మొగ్గు చూపుతున్నారు.
ఒక ఎకరానికి 8వేల నుంచి 9వేల వరకు ఖర్చు వస్తుందని వ్యవసాయాధికారులు తెలిపారు. గతంలో తుకాన్ని వేసి వరినాట్లు వేసే వరకు రైతుల బాధలు అంతాఇంతాకాదు. ప్రత్యేకంగా మడిని సిద్ధం చేయడం నుంచి మొదలుకొని నారు మొలకెత్తిన తర్వాత నీరు పారించడం, కలుపుతీయడం వంటి పని అంతా కూడ వ్యయప్రయాసాలతో కూడుకున్న పని అని రైతులు తెలిపారు. కొత్త పద్ధతిలోనైతే 45వ రోజులకు ఒకసారి కలుపుతీస్తే సరిపోతుంది తుకం పోసిన నుంచి నాటు వేసేదాక ఖర్చు మిగిలి సమయం ఆదాఅవుతుందని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. సంప్రదాయ పద్ధతి కన్నా వెదజల్లే పద్ధతిలో దిగుబడి ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తుకం పోసి ఒక నెల రోజులు పంట ను కాపాడడానికన్నా వెదజల్లే పద్ధతిలో సమయం ఆదా అవుతుంది. తుకం వేసి నాటు వేస్తే ఎకరానికి 25 కిలోల విత్తనం, వెదజల్లే పద్ధతి ఐతే 12, 13 కిలోలు అవసరం వస్తుంది. కూలీలు అవసరం లేకుండానే వెదజల్లే పద్ధతితోనే పంటలను పండిస్తున్నాను. తుకంద్వారా ఎకరానికి 40బ్యాగులు పండిస్తే వెదజల్లే పద్ధతిద్వారా 46 బ్యాగుల వరకు దిగుబడి వస్తుంది. – రాందాసు, రైతు, గట్పల్లి
వెదజల్లే పద్ధతి ద్వారా శ్రమ తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా వస్తుం ది. రెండు సంవత్సరాలుగా మండలంలో రైతులు ఎక్కువగా ఈ పద్ధతినే వాడుతున్నారు. కూలీల బెడద కూడా తప్పుతుంది. ఒకే రోజులో 4,5 ఎకరాలలో సన్నరకంకాని, దొడ్డురకంగాని ఈ పద్ధతిలో సాగుచేసుకోవచ్చు. ఈ సాగు విధానం ద్వారా దిగుబడి సగటున ఎకరాకు 5క్వింటాళ్లు పెరుగుతుంది. – కోటేశ్వర్రెడి,్డ మండల వ్యవసాయాధికారి