న్యూఢిల్లీ: మెట్రో రైలులో బాలుడితో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక స్టేషన్లో ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆ బాలుడు ఎక్స్లో పోస్ట్ చేశాడు. స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. (Man behaves Unnaturally with Boy) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 3న శుక్రవారం రాత్రి 16 ఏళ్ల బాలుడు ఒంటరిగా ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించాడు. ఆ బాలుడి పక్కన కూర్చొన్న 28 ఏళ్ల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలుడి ప్రైవేట్ భాగాలు తాకాడు. మెట్రో రైలు మారే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో ఆ బాలుడ్ని లైంగికంగా వేధించాడు.
కాగా, బాధిత బాలుడు అనంతరం ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇది పోలీస్ దృష్టికి వెళ్లడంతో నిందితుడ్ని గుర్తించేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. రాజీవ్ చౌక్ నుంచి జహంగీర్పురి వరకు 15 మెట్రో స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. నిందితుడు జహంగీర్పురి స్టేషన్లో దిగినట్లు గుర్తించారు. స్థానికులను ఆరా తీసిన తర్వాత 28 ఏళ్ల జితేందర్ గౌతమ్ను వాయువ్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలనీలో గురువారం అరెస్ట్ చేశారు.
మరోవైపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిందితుడు రోజు వారీ వేతనం కింద ఒక సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పారు. బాలుడిపై లైంగిక దాడికి సంబంధించి పోక్సో చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.