సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ : దోమలగూడలోని రామకృష్ణ మఠంలో సంసార్ వేసవి శిబిరంలో భాగంగా ఆదివారం విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. 700 మందికిపైగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి నమసరించుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద వివరించారు. పాదపూజ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద అన్నారు. ఆదివారం దోమలగూడలోని రామకృష్ణ మఠంలో సంసార్ వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. 700 మందికిపైగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగి నమసరించుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియజెప్పే పాటలను రాగయుక్తంగా పాడారు. పాదపూజ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం 15 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంప్లో విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ తల్లిదండ్రులు దైవంతో సమానమని, పాదపూజల వేళ తల్లిదండ్రుల విలువ మరింతగా పిల్లలకు తెలిసివస్తుందని అన్నారు. తల్లిదండ్రులకు పూజలు చేయడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంస్కృతి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రామకృష్ణ మిషన్ నుంచి స్వామి హరిప్రేమానంద, సహజ ఆనంద యోగా వ్యవస్థాపకుడు ఆచార్య రమేశ్ గురూజీ, కవి, గాయకుడు ఎం.శంకర్, శృతిలయ కల్చరల్ అకాడమీ డైరెక్టర్ చిత్తరంజన్దాస్, స్వాములు, ప్రముఖులు, వలంటీర్లు పాల్గొన్నారు.