అవగాహన లోపంతోసిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): అధికారుల నిలోఫర్ దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 9నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జీవోలు, పరిపాలనా పరమైన అంశాలపై కనీస అవగాహన లేకపోవడం, పరిపాలనాధికారి, సూపరింటెండెంట్, ఆ పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం నిలోఫర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. అధికారులు చేసిన తప్పుకు ఉద్యోగులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. కింది స్థాయి అధికారులు చేసిన తప్పును సరిదిద్దాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి సైతం సమస్యను అర్థం చేసుకోకుండా పక్కనబెట్టడంతో సుమారు 63 కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది.
450 పడకల సామర్థ్యం గల నిలోఫర్ దవాఖానను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా దవాఖాన పడకల సామర్థ్యాన్ని 1750కి పెంచింది. పడకల సామర్థ్యంతో పాటు దవాఖానలో యూనిట్ల సంఖ్య కూడా పెంచింది. అయితే విస్తరించిన దవాఖానకు తగిన సంఖ్యలో సిబ్బంది అసరం ఉండడంతో 2017లో అప్పటి సర్కార్ జీవో నంబర్ 88ని జారీ చేసింది. ఈ జి.ఒ ప్రకారం నెలకు రూ.15 లక్షలు వేతనాలు చెల్లించే విధంగా అవసరమైనంత మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలి. సంవత్సరకాల పరిమిత ఉంటే ఈ ఒప్పందాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగిస్తూ జీవోలో నాటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.
ఈ జీవో ప్రకారం 62 మంది ఉద్యోగులను ఔట్సోర్సింగ్ పద్ధతిన నిలోఫర్ అధికారులు నియమించారు. ప్రతి సంవత్సరం కలెక్టర్ ద్వారా ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ వచ్చారు. అయితే 2022లో అప్పటి అధికారులు రెన్యువల్ చేయించలేదు. అయితే అప్పట్లో ఉద్యోగుల జీతాల చెల్లింపు తదితర వ్యవహారాలన్నీ ఆఫ్లైన్లోనే ఉండడంతో అధికారులు రెన్యువల్ లేకుండానే వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. వాస్తవానికి జీవో 88 ప్రకారం ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ ద్వారా ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెన్యువల్ చేయిస్తూ ఉండాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంవత్సరం ఆరంభంలో ఉద్యోగుల వివరాలన్నింటినీ ఆన్లైన్ చేస్తూ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువస్తూ జీవో జారీ చేసింది. దీంతో నిలోఫర్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో పొందు పర్చాలంటే నిబంధనల ప్రకారం వారి కాలపరిమితి 2022లోనే ముగిసింది. దీంతో ఉద్యోగుల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో చేర్చే వీలు లేకుండా పోయింది.
ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలు పొందుపర్చకపోవడంతో వారికి జీతాలు విడుదల కావడం నిలిచిపోయింది. దీంతో కళ్లు తెరిచిన దవాఖాన సూపరింటెండెంట్, ఏఒ తధితర అధికార గణం ఆగ మేఘాల మీద ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్కు సంబంధించిన ఫైల్ను తయారు నిలోఫర్ అధికారులు జిల్లా కలెక్టర్కు పంపకుండా అవగాహన లోపంతో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి పంపారు. ఫైల్ ముఖ్య కార్యదర్శికి చేరడానికి నెలల సమయం పట్టడం, చేరిన తరువాత పాత జిఒపై అవగాహన లేని సదరు అధికారి ఆ ఫైల్ను పక్కనబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చేసిన తప్పిదంతో గత 9నెలలుగా ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమకు వేతనాలు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.