ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 8 : ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 27న నిర్వహించబోయే 81వ స్నాతకోత్సవంలో వేదికపై పీహెచ్డీ పట్టాలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్నఅ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.300 అపరాధ రుసుముతో సోమవారం సాయంత్రం అయిదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వేదికపై బంగారు పతకాలు తీసుకునేవారు తమ పేర్లను ఈ నెల 23వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
తమ పేర్లు నమోదు చేసుకోని వారు స్నాతకోత్సవం తరువాత తమ కార్యాలయం నుంచి స్వీకరించవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https://osmaniaerp.com/ouconvocationలో చూసుకోవచ్చని సూచించారు.