ఓఆర్ఆర్ -2 తాగునీటి పథకంలో తొలి ఫలాలు షురూ
215 కి.మీ. పైప్లైన్ పనులు పూర్తి
మొదలైన తాగునీటి సరఫరా.. నల్లా కనెక్షన్లు జారీ
కొత్త కనెక్షన్ల కోసం ప్రత్యేక క్యాంపులు
రాబోయే 10 రోజుల్లో మరో 58 కాలనీలకు
సమీక్షా సమావేశంలో జలమండలి ఎండీ దానకిశోర్
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న వెంటనే నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మిగిలి ఉన్న 75 కి.మీ. మేర పనులు పూర్తి చేసి 10 రోజుల్లో మరో 58 కాలనీలకు కూడా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు లోపల గ్రామాలకు మెరుగైన నీటి సరఫరా లక్ష్యంగా పట్టణ భగీరథ కింద తొలి విడతగా రూ.756.56 కోట్లను వెచ్చించి 70 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 164 రిజర్వాయర్లను నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో 191 గ్రామాల్లోని దాదాపు 10 లక్షల కుటుంబాలకు మెరుగైన తాగునీటిని అందిస్తున్నది. ఇందులో భాగంగానే ఔటర్ రింగు రోడ్డు లోపల కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు సమృద్ధిగా నీరు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.1200కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 12 మండలాల పరిధిలో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు, 2108 కిలోమీటర్ల పైపులైన్ విస్తరణ పనులను గత ఏడాది మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఫేజ్ -2 తొలి ఫలాలను జలమండలి అందించింది. మొదటి ప్రాధాన్యతగా ఈ 60 కాలనీల్లో 215 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరా ప్రారంభించినట్లు బుధవారం జలమండలి ఎండీ ప్రకటించారు. రాబోయే 10 రోజుల్లోగా మరో 58 కాలనీల్లో కూడా పైపులైన్ విస్తరణ పనులను పూర్తి చేసి నీటి సరఫరా ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం అక్కడ 75 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులపై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. పైపులైన్, రిజర్వాయర్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక క్యాంపుల ద్వారా కొత్త కనెక్షన్లు జారీ
నీటి సరఫరా ప్రారంభమైన 60 కాలనీల్లో కొత్త కనెక్షన్ల కోసం జలమండలి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎండీ దానకిశోర్ సూచించారు. ఇప్పటికే పైపులైన్ పూర్తయిన ప్రాంతాల్లో కొత్త నల్లా కనెక్షన్ల నమోదుకు జలమండలి ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
డిసెంబరు నాటికి ఫేజ్ -2 పనులు పూర్తి
ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులను దశలవారీగా ఈ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. ఈ దిశగా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం నాటికే పైపులైన్ పనులు పూర్తి చేయాలన్నారు. రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో సైతం వేగం పెంచాలని సూచించారు. పైపులైన్ విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, కార్మికుల కోసం తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ స్వామి, జలమండలి సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.