సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఈ ఆదివారం సాయంత్రం నగర వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకం. కొత్త సచివాలయం ప్రారంభం కావడంతో దాన్ని చూసేందుకు నగర వాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సందడి నెలకొంది. పగలంతా ప్రారంభోత్సవం హడావిడి నెలకొని ఉంటే, సాయంత్రం కాగానే సరికొత్త సందడి నెలకొంది. కొత్త సచివాలయం ప్రారంభం నేపథ్యంలో కలర్ లైటింగ్, లేజర్ షో బాణాసంచాతో సంబురాలు నిర్వహించారు. వీటికి తోడు హుస్సేన్సాగర్ జలాల్లో ఉన్న మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ ప్రదర్శన మరింత ప్రత్యేకతను సంతరించుకొంది. రాత్రి 8, 9 గంటల ప్రాంతాల్లో ప్రదర్శించిన మ్యూజికల్ ఫౌంటెయిన్ నగర వాసులను విశేషంగా ఆకట్టుకున్నది. రాత్రి పూట వెలుగు జిలుగుల మధ్య వెలిగిపోతున్న సచివాలయం ముందు నగర వాసులు ఎంతో ఆనందంగా గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కొత్త సచివాలయం ఫొటోలతో వాట్సాప్ స్టేటస్లు, ట్విట్టర్లో పోస్టింగ్లు మొత్తంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
కేసీఆర్ ధార్మిక చిత్తశుద్ధికి నిదర్శనం..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ధూప, దీప నైవేద్య పథకం ఫైలు పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేయడం సంతోషం. ప్రతిష్టాత్మకమైన సచివాలయ ప్రారంభోత్సవం రోజున తీపి కబురు అందించడం సీఎం కేసీఆర్ ధార్మిక చిత్తశుద్ధికి నిదర్శనం. ఆలయాల నిర్మాణం, భక్తుల సౌకర్యమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు బాగున్నాయి. ఆలయాలు నిరాదరణకు గురి కాకుండా ధూప, దీప నైవేద్య పథకం ద్వారా తోడ్పాటును అందిస్తుండటం హర్షణీయం. పేద, మధ్య తరగతి అర్చకులకు సైతం జీవనోపాధి మరింత బలపడుతుంది. సీఎం కేసీఆర్కు భగవంతుడితో పాటు , అర్చకుల సంపూర్ణ ఆశీర్వాదం సదా ఉంటుంది.
– కాటేపల్లి శ్రీనివాస్శర్మ, అర్చకుడు, శేరిలింగంపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు
ధూప, దీప నైవేద్యం పథకం పట్టణ ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పథకం అమలు నిర్ణయంపై తొలి సంతకం చేసిన దేవాదాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు. దేశంలోనే ఇంతగొప్ప నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని పూజారులు, బ్రాహ్మణ కుటుంబాలు రుణపడి ఉంటాయి.
– కాండూరి నరేంద్రాచార్య,తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ వైష్ణవ సేవా సమితి అధ్యక్షుడు.
అద్భుత నిర్మాణం
ఈ శతాబ్దపు అద్భుత కట్టడం తెలంగాణ సచివాలయం. ఇది తెలంగాణకు గర్వకారణం. సీఎం కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనం. కేంద్రం నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనం కంటే విశాలమైన ఈ భవనంలో అత్యాధునిక వసతులు ఉన్నాయి. ఇంతటి సువిశాల నిర్మాణ భవనాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించడమనేది కేసీఆర్ ముందుస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణకు నిదర్శనం. ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకునే అవకాశం లభించడం, ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా.
– కోలేటి దామోదర్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు
నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సంతకం చేయడం గొప్పవిషయం. కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబాలు సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– జగన్నాథం ప్రవీణ్,తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
తీపి కబురు అందించారు..
ఎంతో కాలంగా క్రమబద్ధీకరణ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసి తీపి కబురు అందించడం అభినందనీయం. కాంట్రాక్టు ఉద్యోగుల కండ్లల్లో ఆనందాన్ని నింపిండ్రు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హారీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వి. శ్రీనివాస్, తెలంగాణ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఏటీవోల సంఘం ప్రధాన కార్యదర్శి
అర్చక, ఉద్యోగులకు వేతనాలిచ్చిన ఘనత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 17 వందల ఆలయాలకు ధూప, దీప నైవేద్యాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం కేసీఆర్ పథకాన్ని అమలు చేయడం హర్షణీయం. దేశంలోని 29 రాష్ర్టాల్లో ఏ రాష్ట్రంలోని లేని విధంగా దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతభత్యాలను అందించి చిరస్థాయిగా చరిత్రలో నిలిచారు. అర్చక, ఉద్యోగుల వేతనాల కోసం 1.17 కోట్ల నిధులను కేటాయించడం గొప్పవిషయం. ధూప, దీప నైవేద్యం పథకం కోసం 56 కోట్లు ఖర్చు చేసి గొప్ప హిందూత్వవాదిగా సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు.
-గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్