సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వాట్సాప్ గ్రూప్లో ఓ మహిళ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశచూపి రూ.13.36 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మౌలాలీ, తిరుమలనగర్కు చెందిన బాధితురాలి నంబర్ను ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీన బీసీటీ ట్రేడింగ్ వాట్సాప్ గ్రూప్లో గుర్తుతెలియని వ్యక్తులు యాడ్ చేశారు. ఆ గ్రూప్లో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తున్నాయని చర్చిస్తూ బాధితురాలిని నమ్మించారు. దీనికి బాధితురాలు స్పందించడంతో ఆ గ్రూప్ అడ్మిన్లు (www.pmgold.info/site/login) లింక్ పంపించారు. దానిలో బాధితురాలు ఎంట్రీ అయి రెండు రోజులు పరిశీలించిన తరువాత రూ.5 వేలు పెట్టుబడి పెట్టడంతో వెయ్యి రూపాయలు లాభం వచ్చింది. మంచి వ్యాపారం అనుకొని దఫదఫాలుగా రూ.13.36 లక్షలు పెట్టుబడి పెట్టింది. అయితే లాభం చూపిస్తున్నప్పటికీ తీసుకొనే అవకాశం లేకపోవడంతో చివరకు మోసం జరుగుతుందని గుర్తించి రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
మరో ఘటనలో రూ.6.68 లక్షలు
అన్నోజిగూడకు చెందిన బాధితురాలి నంబర్ను గుర్తుతెలియని వ్యక్తులు బీటీసీ రోడ్డు టూ వెల్త్ అనే గ్రూప్లో యాడ్ చేశారు. అందులో మైఖెల్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నానని నమ్మించి బియాన్స్ యాప్ వాలెట్ నుంచి క్రిప్టో యూఎస్డీటీని కొనిపించాడు. ఆ తరువాత బీఎస్క్యూ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేయించి దాని ద్వారా అందులో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తూ మొదట్లో కొన్ని లాభాలు చూపించాడు. దీంతో బాధితురాలు రూ.6.68 లక్షలు పెట్టుబడి పెట్టింది. లాభం చూపిస్తున్నప్పటికీ తీసుకొనే అవకాశం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ తెలిపారు.