సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీసుకోలేకపోయానంటూ బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. విద్యానగర్కు చెందిన ఒక వ్యాపారి తన ఫోన్ నంబర్ను షేర్హెల్త్ అనే పేరుతో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాడు. ఈ గ్రూప్లో చాటింగ్ చేస్తున్న కొంతమంది.. మేం పెట్టుబడి పెట్టినదానికి భారీగా లాభాలొచ్చాయంటూ చర్చించుకుంటున్నారు. ఆ చర్చలను చూసిన విద్యానగర్ వాసి.. ఆకర్షితుడై ఆ చర్చలో తాను కూడా భాగస్వామి అయ్యాడు. మీరు ఒకటి రెండు రోజులు చూడండి.. భారీ లాభాలు చూస్తారంటూ చాటింగ్ చేస్తున్న వ్యక్తులు సూచించారు. యూఎస్డీటీ క్రిప్టో ట్రేడింగ్ చేరాలంటే ఆ లింక్ను క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
బాధితుడు వారు చెప్పిన విధంగానే లింక్ క్లిక్ చేసి, యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో యూఎస్డీటీ క్రిప్టోకరెన్సీ కొనేందుకు వెసులుబాటు కల్పించారు. క్రిప్టో బటన్ నొక్కగానే.. క్రిప్టో ట్రేడింగ్ చేసే వెబ్సైట్కు వెళ్తుంది. అక్కడ క్రిప్టో కొన్న తర్వాత, క్రిప్టో ఐడీని డౌన్లోడ్ చేసిన యాప్ నిర్వాహకులకు ఇవ్వడంతో, ఆ నంబర్తో వాళ్లు ట్రేడింగ్ చేస్తారు. మొదట్లో వారం రోజుల పాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టడంతో రూ.5 లక్షల వరకు లాభాలు వచ్చాయి. అంతా నిజమని నమ్మిన బాధితుడు ఒకేసారి రూ. 30 లక్షలు విలువజేసే క్రిప్టో కరెన్సీ కొని వాళ్లకు అప్పగిస్తూ వచ్చాడు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో భారీగా లాభాలొచ్చాయని నిర్వాహకులు సూచిస్తూ.. యాప్లో స్క్రీన్పై భారీ లాభాలు వచ్చినట్లు కన్పించాయి. కానీ, స్క్రీన్పై కనిపించిన డబ్బు డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే, ప్రస్తుతం మార్కెట్ బాగుంది.. మీరు మరింత పెట్టుబడి పెట్టండి.. ఒకేసారి లాభాలు తీసుకోవచ్చంటూ యాప్ నిర్వాహకులు సూచించడంతో మిగతా రూ.70 లక్షలు కూడా పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్పై రూ.5 కోట్లు లాభంగా చూపించారు. ఆ నగదును డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. వచ్చిన లాభాలు ఇవ్వకపోవడం, మరింత పెట్టుబడి పెట్టాలంటూ సైబర్నేరగాళ్లు సూచిస్తుండటంతో ఇదంతా మోసమని గుర్తించి, గురువారం బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.