హైదరాబాద్ : సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రాంతంలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఒక మృతదేహాన్ని అధికారులు శనివారం గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గుజరాత్కు చెందిన వసీం, జునైద్, జాహిద్ భవనంలోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. తాజాగా స్టోర్ మొదటి అంతస్తులో ఓ వ్యక్తి అస్థిపంజరాన్ని గుర్తించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, లభించిన అస్థిపంజరం ఎవరిదనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.
అంతకుముందు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. కాలిపోయిన భవన శిథిలాలను క్రేన్ సహాయంతో పరిశీలించారు. అనంతరం ఆయన బస్తీవాసులతో మాట్లాడారు. రెండురోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఇంకా మంటలు చల్లారకపోవడంతో ఫైర్ అధికారులు ఫోమ్ తో స్ప్రే చేస్తున్నారని వెల్లడించారు. క్లూస్ టీమ్ తో పాటు జీహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులు భవనాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు. అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.