సిటీ బ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మనపైనా పడుతున్నది. ఇండియాకు వచ్చే క్రూడ్ ఆయిల్ అధిక మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతున్నది. అటు ఇరాన్ సైతం అమెరికా బెదిరింపులకు లొంగబోమని, యుద్ధాన్ని విరమించలేమని స్పష్టంగా చెప్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్ల దాడులను మాత్రం కొనసాగిస్తున్నాయి. అక్కడి క్రూడ్ ఆయిల్ కేంద్రాలపై మిస్సైళ్లతో దాడిచేసి ధ్వంసం చేస్తున్నాయి.
అటు ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులకు తెగబడుతున్నది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న చమురు నిల్వలపై ప్రభావం చూపుతున్నది. అక్కడి నుంచి వచ్చే చమురు సరఫరా నిలిచిపోతుందేమోనని భయపడుతున్నారు. ఇదే సమయంలో ఆయిల్ కంపెనీలు డీలర్లకు షాక్ ఇచ్చాయి. డీలర్లకు గతంలో ఇచ్చిన ఉద్దెర బకాయిలు పూర్తిగా ఒకేసారి చెల్లిస్తేనే డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తామని తేల్చి చెప్తున్నాయి. ఈ విధానాన్ని తక్షణమే అమలు చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నది. ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల యుద్ధం సాకుతో కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ఆయిల్ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డీలర్లను కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
బకాయిలు చెల్లించకుంటే..
పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ఆయిల్ కంపెనీలు స్థాయిని బట్టి డీలర్లకు రూ.లక్షల్లో ఉద్దెర ఇచ్చాయి. హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ మాత్రం టార్గెట్లు రీచ్ అయ్యేందుకు క్రెడిట్లను ఇబ్బడిముబ్బడిగా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఒక్కో డీలర్ రూ.కోట్లలో బకాయిలు పడి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు ఆ మొత్తంతో పాటు ప్రస్తుతం అయ్యే డబ్బును కలిపి చెల్లిస్తేనే సరఫరా కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నది. ఇండియన్ ఆయిల్ కంపెనీ మాత్రం ఐదు రోజులకు ఒకసారి చెల్లింపులు చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆ కంపెనీ వద్ద డీలర్ల బకాయిలు తక్కువగా ఉన్నట్లు సమాచారం.
భారత్ పెట్రోలియం కంపెనీ కూడా పూర్తి బకాయిలను చెల్లించాల్సిందేనని స్పష్టంగా చెప్తున్నది. వినియోదగారులకు క్రెడిట్ పెట్టిన డీలర్లు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. లక్షలాది రూపాయల బకాయిలను ఒకేసారి చెల్లించాలంటే తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తంలో డబ్బులు ఒకేసారి సర్దుబాటు కాకపోవడంతో బంకులను మూసేసే పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే సరఫరా కొనసాగిస్తామని ఆయిల్ కంపెనీలు తెగేసి చెప్తుండటంతో రెండు మూడు రోజులకు మించి బంకులను నడపలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పష్టత ఇవ్వకుంటే ఇక్కట్లే..
దేశంలో చమురు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో ఆయిల్ కంపెనీలు, డీలర్ల మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల తీరుతో ప్రజల్లోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఇప్పుడున్న నిల్వలు కొద్దిరోజులకే సరిపోతే భవిష్యత్తులో పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు. ఆయిల్ కంపెనీలకు కచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి, పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని చెప్పాలని డీలర్లు కోరుతున్నారు.డీలర్లను బకాయిల కోసం ఇబ్బంది పెట్టొద్దని చమురు నిల్వల కొరత ఉండదని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వదంతులను నమ్మి ఆందోళనకు గురికావొద్దని అటు ప్రజలకు కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే కృత్రిమ కొరతలు సృష్టించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే ప్రమాదముందని చెబుతున్నారు.