సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): విలువైన భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన వారు.. ఒక విభాగం అధికారులు మరో విభాగం అధికారులపై ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారుల అధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్నానని, తనను వేరే విభాగానికి బదిలీ చేయాలంటే ఓ ఉద్యోగి ఎస్టేట్ విభాగం ఉన్నతాధికారికి విన్నవించుకునే దాకా వెళ్లింది.
ఈ పరిస్థితి హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో కీలకంగా ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లో నెలకొంది. నేను కమిషనర్ మనిషిని.. నేను చెప్పినట్లు వినాలి… వినకపోతే నీపై కమిషనర్కు ఫిర్యాదు చేస్తా.. నిన్ను సస్పెండ్ చేయిస్తాను… ఇది ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఓ అధికారి… ఎస్టేట్ వింగ్లో పనిచేసే సైట్ ఆఫీసర్తో అన్న మాటలు.
ఇలాంటి పనితీరు హెచ్ఎండీఏలో నేనెప్పుడు చూడలేదని, ఇటీవల కొత్తగా పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్పై వచ్చిన అధికారులు ఉన్నతాధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి అధిపత్యం కోసం సహచర ఉద్యోగుల పై వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. హెచ్ఎండీఏలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్న తమపై డిప్యూటేషన్పై వచ్చిన కొందరు అధికారులు తీరును భరించలేకపోతున్నామని వాపోతున్నారు.
అన్యాక్రాంతమవుతున్న భూముల పరిరక్షణకు మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న భూములు అత్యంత విలువైనవి కావడంతో వాటిని కాపాడాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులకు ఇటీవల హెచ్ఎండీఏపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ కమిషనర్ ఎస్టేట్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశమై మొత్తం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూముల లెక్కలను గుర్తించాలని ఆదేశించడంతో ఆ లెక్కలు తీశారు. దాని ప్రకారం సుమారు 8347 ఎకరాలు ఉన్నట్లు తేలింది.
కొన్ని చోట్ల 200-300 గజాల నుంచి మొదలు కొని ఎకరాల్లో స్థలాలు ఉన్నాయి. ఇందుకోసం మొత్తం ఏడుగురికి సైట్ ఆఫీసర్లుగా నియమించి ప్రతి రోజు వారికి కేటాయించిన భూముల వద్దకు వెళ్లి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎస్టేట్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను నడిపిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా భూముల కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓ ఉన్న పోలీసు బలగాలను తీసుకొని రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అవసరమైతే కబ్జాదారులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తూ విలువైన స్థలాలను కాపాడాల్సి ఉంటుంది.