సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు… విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనల్లో ముగ్గురు విద్యుత్ఘాతానికి గురై మృతి చెందారు. విద్యుత్ ప్రమాదాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నా ఎక్కడో ఒక చోట వరసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అప్రత్తమత్తమై మరోసారి గ్రేటర్ హైదరాబాద్లోని 9 సర్కిళ్ల పరిధిలోని వివిధ స్థాయిల్లోని అధికారులకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ షాక్ వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వెంబడి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బయట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ షాక్తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతుంటారు. పాతబస్తీలోని బండ్లగూడలో విద్యుత్ షాక్తో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. నల్లా నీరు పట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వర్షం కురిసి నేల తడిగా మారినప్పుడు ప్రమాద తీవ్రత పెరుగుతుంది. నివాసం ఉండే ఇంటితో పాటు పని చేసే కార్యాలయం, పాఠశాల, దేవాలయం ఇలా పలు చోట్ల వర్షా కాలంలో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.