సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఐరన్ బాక్స్లో గంజాయి దాచి.. ఒడిశా నుంచి హైదరాబాద్ పాత బస్తీకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీదర్కు చెందిన బహుల్య లీలావతి అలియాస్ గంగరాజు, గోపాల్ అలియాస్ మూల్ చంద్, సంతోష్, మోహన్ రాథోడ్ ఒక గ్యాంగుగా ఏర్పడ్డారు. వీరంతా ఒడిశా నుంచి హైదరాబాద్ పాత బస్తీకి గంజాయిని సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్లోని నాచారానికి చెందిన పెద్ద బాబూరావు, అతడి స్నేహితుడు మద్దెల రమేశ్తో గంగరాజు టీమ్ మాట్లాడింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేయాలని, ఇందుకు ఒక గూడ్స్ క్యారియర్ను తీసుకొని అందులోని ఐరన్ బాక్స్ల్లో గంజాయి ప్యాక్ చేసి రవాణా చేస్తే ఎవరికీ పట్టుబడమని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా మోహన్ రాథోడ్, పెద్ద బాబూరావు, మిద్దెల రమేశ్ కలిసి గూడ్స్ క్యారియర్ ఆటోలో ఒడిశా నుంచి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. వీరికి పైలెట్గా గోపాల్, సంతోష్ వస్తున్నారు. వీరు కీసర పోలీస్స్టేషన్ పరిధిలోకి రాగానే.. మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు, కీసర ఇన్స్పెక్టర్ వెంకయ్య బృందాలు విశ్వసనీయ సమాచారంతో అశోక్ లీలాండ్ దోస్త్ గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఇనుప బాక్స్లలో దాచిన గంజాయి డబ్బాలు బయటపడ్డాయి. మోహన్ రాథోడ్, బాబూరావు, మద్దెల రమేశ్ను అరెస్టు చేశారు. పైలెట్గా వస్తున్న వారు పోలీసులను చేసి పరారయ్యారు. ఈ ముఠా నుంచి 430 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 1.1 కోట్లు ఉంటుందని సీపీ చెప్పారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకీ, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి ఢిల్లీ వయా హైదరాబాద్ మీదుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం మీడియాకు వివరించారు. విశాఖపట్టణం జిల్లాకు చెందిన నూకరాజు, అక్కబాతుల లక్ష్మణ్ కుమార్, గంట శ్రీను బాబు కలిసి ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్నారు. నూకరాజు వద్ద ఉన్న ట్యాంకర్ లారీని గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు ఇద్దరికీ లక్ష రూపాయలు ఇస్తారు. ఈ నెల 18వ తేదీన నూకరాజు ఇద్దరిని పిలిచి పోలవరంలో గంజాయిని లారీలో నింపి, దానిని ఢిల్లీలో అప్పగించాలని సూచించాడు. దీంతో లక్ష్మణ్, శ్రీను కలిసి లారీ తీసుకొని ఢిల్లీకి ఖమ్మం, సూర్యపేట, హైదరాబాద్ మీదుగా వెళ్లేందుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు రాగానే విశ్వసనీయ సమాచారంతో హయత్నగర్ పోలీసులు లారీని ఆపి తనిఖీలు చేశారు. అందులో 200 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి, సూత్రధారి నూకరాజు కోసం గాలిస్తున్నారు. గంజాయి విలువ రూ. 60.10 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, వనస్థలిపురం ఏసీపీ భీమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా గంజాయి, చరాస్ ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ ఘటన శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శంషాబాద్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన నిలేష్ ఇండోరియా (28), మనీష్ (20) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వలస వచ్చారు. డబ్బులు సంపాదించాలనే ఆశతో పలు రాష్ర్టాల నుంచి గంజాయి, చరాస్ను తీసుకువచ్చి ఐటీ ఉద్యోగులకు విక్రయించడం మొదలుపెట్టారు. ఈ నెల 19వ తేదీన నానక్రాం గూడలోని విప్రో జంక్షన్ వద్ద ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి చరాస్, గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ. 8.5 లక్షలు ఉంటుందని చెప్పారు. సమావేశంలో శంషాబాద్ డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.