నేరేడ్మెట్, ఫిబ్రవరి 6 : మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం తాసీల్దార్ కార్యాలయంలో డీటీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీదేవితో కలిసి ఆయన మాట్లాడారు. మండల పరిధిలో ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం 734 అప్లికేషన్స్ రాగా.. అందులో 232 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ కోసం నోటీసులు ఇప్పటికే జారీ చేశామన్నారు. ప్రస్తుతం ఇక్కడున్న మార్కెట్ ధరను అనుసరించి అర్హత సాధించిన లబ్ధిదారులకు డిమాండ్ నోటీసులను జారీ చేసి క్రమబద్ధీకరణకు డీడీల ద్వారా డబ్బులు చెల్లించాలన్నారు. జీఓ 59లో 2014 జూన్ 2 నాటికి ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను మాత్రమే రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం విధితమే.
250 గజాల్లోపు ఇళ్లు నిర్మించుకుంటే ఆ ఏరియాలో ప్రభుత్వ ధరలో 25 శాతం, 251 నుంచి 500 వరకు 50శాతం, 500 లోపు ఇళ్లు నిర్మించుకుంటే 75 శాతం చెల్లించే విధంగా వచ్చిన దరఖాస్తుల ఆధారంగా డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల పరిధిలో 59 జీఓలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందులో ఆర్డీవో , తాసీల్దార్లు ప్రత్యేక దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిమాండ్ నోటీసులను జారీ చేశారని చెప్పారు. లబ్ధిదారులు నోటీసుల ఆధారంగా డీడీల ద్వా రా డబ్బులు చెల్లించినట్లయితే ఇళ్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని తాసీల్దార్ కోరారు.