బంజారాహిల్స్ : సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోని కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమావేశం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ( Secundrabad ) స్థానానికి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మద్యనే పోటీ ఉంటుందన్నారు. గత ఎన్నికలలో బీజేపీ తరపున గెలిచిన కిషన్రెడ్డి (Minister Kishan reddy) కేంద్రమంత్రిగా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదనే విషయాన్ని గ్రహించిన ప్రజలు మరోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారన్నారు.
మూడునెలల క్రితమే బీఆర్ఎస్ (BRS) తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడం ఆపార్టీ బలహీనతను సూచిస్తున్నదన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలు వాటిని నెరవేర్చలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎక్కడ చూసినా మంచినీటి కష్టాలు, కరెంట్ కష్టాలు ఉన్నాయని, ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే బీఆర్ఎస్ కార్యకర్తలు పనిగా పెట్టుకోవాలని సూచించారు.
పద్మారావు గౌడ్ ( Padmarao Goud) ను ఎంపీగా గెలిపించుకునేందుకు బూత్స్థాయినుంచి ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఈ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు, దాసోజు శ్రావణ్కుమార్నాయకులు పాల్గొన్నారు.