విద్యుత్ సరఫరాకు అధికారుల ఏర్పాట్లు
డివిజన్లో నూతన ట్రాన్స్ఫార్మర్లు
మరమ్మతులు, ఫీడర్ల పునరుద్ధరణ
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 6 : వేసవికాలంలో అమాంతం పెరిగే విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని.. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. గతేడాది వేసవిలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ యేడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తేవడం, జంక్షన్ల వద్ద మరమ్మతులు, ఫీడర్ లైన్ల పునరుద్ధరణ, చెట్ల కొమ్మల తొలగింపు పనులను పూర్తి చేశారు.
ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు..
డివిజన్ పరిధిలో రెండు లక్షలకు పైగా డెమొస్టిక్, కమర్షియల్, పరిశ్రమలకు చెందిన సర్వీసులున్నాయి. గతేడాది ఎదురైన విద్యుత్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ యేడాది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హెచ్ఎంటీ హిల్స్, శంషీగూడ సబ్స్టేషన్లలో 12.5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అలాగే 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 24, 100 నుంచి 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 15 ఏర్పాటు చేశారు. ఆరు ప్రాంతాలలో సుమారుగా మూడువేల మీటర్ల దూరం అడిషనల్ సర్క్యూట్ను అందుబాటులోకి తెచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు, ఏబీస్విచ్ల రిపేయిర్లు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తులను సరిచేయడం లాంటి పనులు చేశారు. అలాగే లో వోల్టేజీ సమస్యలు రాకుండా ట్రాన్స్ఫార్మర్లు, సీటీ లైన్లను పునరుద్ధరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విద్యుత్ తీగలను మార్చడం, కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే పనులను పూర్తి చేశారు.
డిమాండ్కు అనుగుణంగా..
వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. గతేడాది ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, విద్యుత్ తీగలను మార్చడం, జంక్షన్ల వద్ద మరమ్మతులు పూర్తి చేశాం. వేసవితో పాటు రానున్న వర్షాకాలంలో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం.
– చక్రవర్తి, డీఈ, కూకట్పల్లి విద్యుత్ డివిజన్