ఉమ్మడి శామీర్పేటలో తగ్గిన వరి
పెరిగిన ఇతర పంటల సాగు విస్తీర్ణం
శామీర్పేట, మార్చి 31 : వరికి కేరాఫ్గా ఉన్న ఉమ్మడి శామీర్పేట మండలంలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో శామీర్పేట, మూడుచింతలపల్లిలో ఇతర పంటల సాగు పెరిగింది. ఇతర పంటల సాగుతో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన వరి సాగు..
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనలేమని చేతులెత్తేయడంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను అలర్ట్ చేశారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ, ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. దీంతో ఉమ్మడి శామీర్పేట మండలంలో సుమారు మూడు వేల పైచిలుకు ఎకరాల్లో వరి సాగు తగ్గింది. గత యాసంగిలో శామీర్పేట మండలంలో 2,350 ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతం 820 ఎకరాలకే పరిమితమైంది. మూడుచింతలపల్లి మండలంలో గతంలో 2800 ఎకరాల్లో సాగు చేయగా..1800 ఎకరాలకు సాగు తగ్గింది.
పెరిగిన పండ్లు, కూరగాయల సాగు..
ఉమ్మడి శామీర్పేట మండలంలో కూరగాయలు, పండ్ల పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపారు. శామీర్పేటలో పండ్లు, కూరగాయ పంటలు 1700 ఎకరాల్లో సాగు చేయగా… ప్రస్తుతం 2200 ఎకరాల్లో, మూడుచింతలపల్లిలో 1930 ఎకరాల్లో సాగు చేస్తుండగా… 2340 ఎకరాలకు పెరిగింది.
రైతులకు మంచి రోజులు
రైతాంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేయాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారు. ఎవుసం అంటే దండుగ అన్న మాటను మార్చి ఏ పంట ఎప్పుడు వేస్తే ఏ విధమైన లాభాలు వస్తాయనే అవగాహన కల్పిస్తూ లాభాలవైపు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుత యాసంగిలో వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో వరి సాగు తగ్గింది. పండ్లు, కూరగాయల సాగు పెరిగింది.
–కంటం కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
కూరగాయలతో లాభాలు
నగరానికి కూతవేటు దూరంలోనే ఉండటంతో కూరగాయల సాగు ఈ ప్రాంత రైతులకు ఎంతో లాభదాయకంగా మారింది. ప్రతినిత్యం నగరానికి కావాల్సిన కూరగాయలను అందించడంలో శామీర్పేట, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మేడ్చల్, సిద్దిపేట జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. వరిని వదిలి ఇతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.
–ఇంద్రసేనారెడ్డి, రైతు కేశవరం