సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : అది ఎల్బీనగర్లోని ఓ పెట్రోల్ బంక్. సాధారణంగా రోజుకు ఆ బంక్కు 3-5 ట్యాంకర్లు వస్తాయి. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ 12వేల నుంచి 20వేల లీటర్లు ఉంటుంది. ఈ లెక్కన బుధవారం ఆ బంక్కు 3 ట్యాంకర్లు వచ్చాయి. కానీ ఆ బంక్లో చాలా వరకు వాహనాలకు ఇంధన సరఫరా జరగలేదు. మరి ఆ ట్యాంక్ల ఇంధనం ఎటువెళ్లింది? ఇక్కడే అసలు బ్లాక్ మార్కెట్ దందాకు ఆజ్యం పడుతున్నది.
రోజంతా ఆ ట్యాంకర్లు అమ్ముకుంటే వచ్చే ఆదాయం కంటే బ్లాక్లో అమ్మడం రెండింతల లాభం వస్తుండటంతో డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రాత్రికి రాత్రే డ్రమ్ములు, క్యాన్లతో అవసరమైన వ్యాపారులకు ఇంధనాన్ని అందిస్తున్నారు. ఫలితంగా వాహనదారులకు ఆ బంక్లో ఇంధనం దొరకడం లేదు. వచ్చిన 3 ట్యాంకుల్లో ఒక ట్యాంక్లో సగం ఇంధనం వాహనాలకు పోస్తున్నట్టుగా దృష్టి మరల్చి ఆ వెంటనే ‘నో స్టాక్ ’ బోర్డులు పెట్టేస్తున్నారు. ఇలా నగరంలోని 460 బంక్ల్లో చాలా వరకు బంక్లు బ్లాక్ దందాతో డబ్బులు దండుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలో ఇంధన కొరత వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నా.. బంక్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ ఉంటున్నాయి. ఆ క్యూలైన్లలో ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్లే అధికంగా ఉండటం గమనార్హం. సిటీలో బుధవారం సగానికిపైగా బంక్లను ఇంధనం లేదని మూసివేశారు. కొన్ని రూ.150 నుంచి 200 వరకు రేషన్ విధానాన్ని పాటించి సరఫరా చేశాయి. ఆ వెంటనే నో స్టాక్ బోర్డులు పెట్టి చేతులు దులుపుకొన్నాయి.
బంక్లపై సరైన నిఘా లేకపోవడంతోనే ఈ రకమైన మోసాలకు డీలర్లు పాల్పడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కండ్ల ముందరే ట్యాంకర్ వచ్చిందని గంట సమయంలోపే పూర్తయిపోయిందని చెప్పి వెనక్కి పంపించారంటూ ఓ వాహనదారుడు వాపోయాడు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్, దిల్సుక్నగర్, తార్నాక, బేగంపేట, బంజారాహిల్స్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, సనత్నగర్, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో బంక్లు వేలాది వాహనాల క్యూలైన్లతో దర్శనమిచ్చాయి. ఈ కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
పోలీసులు అలాంటి ప్రాంతాల్లో వాహనాలను క్రమపద్ధతిలో ఉంచడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. ఇంధనం కోసం బంక్ల ముందర వాహనదారులు కొన్ని చోట్ల ముష్టియుద్ధాలు చేయాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల బంక్ సిబ్బందితో ఘర్షణలకు దిగారు. ఇంధనం ఉండి కూడా పోయడం లేదని కొందరు వాహనదారులు బంక్ల ముందర నిరసన వ్యక్తం చేశారు. కాగా, చాలా మంది వాహనదారులు ఇంధన సంక్షోభం తలెత్తుతుందనే ఆందోళనతో చాలా మంది పెట్రోల్ను ఫుల్ ట్యాంక్ పోయించుకుంటున్నారు. ఇలా చేయడంతో బంక్లోని ఇంధనం తొందరగా పూర్తవ్వాల్సి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా ఎప్పటిలాగానే ఇంధనం వినియోగిస్తే ఎవ్వరికి ఇబ్బం ది ఉండదని కొందరు డీలర్లు సూచించారు.