బంజారాహిల్స్,డిసెంబర్ 26: చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కే.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా కొవిడ్ వల్ల భారత్ సహా ఇతర దేశాలపై ప్రభావం ఎంత అనే విషయంపై శాస్త్రీయ వాస్తవాలపై ఆధారపడకుండానే అనేక రకాల పుకార్లు వస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 220 కోట్ల వ్యాక్సిన్ డోస్లతో అధిక టీకా కవరేజ్ని అందించడంతో భారత్లో ఎక్కువగా ప్రమాదం లేదనే భావించాలని వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, రద్దీ ప్రదేశంలో మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్ ఉపయోగించడం, బూస్టర్ డోస్ వేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. జ్వరం, శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.