రూ.10.66కోట్లు మంజూరు
జల్పల్లిలో శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు
పహాడీషరీఫ్, మార్చి 26: గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్గర్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ, నబిల్ కాలనీ, అమ్రీన్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మంత్రి ముంపు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడుతానని హామీ ఇచ్చారు.. ఇటీవల ముంపు సమస్యల పరిష్కారం కోసం రూ.10.66కోట్లు నిధులు కేటాయించి పనులకు శంకుస్థాపన చేసి హామీని నిలబెట్టుకున్నారు. కొత్తపేటలోని కొత్తమోని కుంటు నుంచి గుర్రం చెరువు చెరువు వరకు నాలా పనులు కొనసాగనున్నాయి. 2.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల పొడవుతో 1.72 కిలో మీటర్లు దూరం వరకు నాలాను అభివృద్ధి చేయనున్నారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ముంపు సమస్య ఉండదు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వందేండ్లలో ఎప్పుడూ పడని వర్షాలు గడిచిన రెండు సంవత్సరాలు పడ్డాయి. వర్షం నీటితో కాలనీ, బస్తీ వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. సమస్య వచ్చినప్పుడల్లా క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి ధైర్యం చెప్పాను. జిల్లా యంత్రాంగాన్ని, మున్సిపల్ అధికారులను, సిబ్బందిని రంగంలోకి దింపి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశాం. ముంపు సమస్య పరిష్కారం కోసం నిధులు కేటాయించాను. త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసినా ముంపు సమస్య అనేది రాదు.
గ్రామాల అభివృద్ధికి కృషి
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆకులమైలారం ఉప సర్పంచ్ రాంరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పొన్న అంజయ్య శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గ్రామం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఎన్ఆర్ఈజీ పథకంతో పాటు ఫార్మాసిటీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రధాన సమస్యలు పరిష్కారం అయినట్లు చెప్పారు. కార్యక్రమంలో సురేందర్రెడ్డి, టైరు పాండు పాల్గొన్నారు.