సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులకు మోక్షం లభించింది. పరిపాలనా విభాగంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించి మొత్తం 27మంది ఉద్యోగుల పదోన్నతుల అంశం కొంత కాలంగా అపరిష్కృతంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజలకు సేవలందిస్తున్న వైద్యసిబ్బంది నియామకాలు, పదోన్నతులు తదితర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే విడతల వారీగా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా పరిపాలనా విభాగంతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 17మందికి పదోన్నతులు కల్పిస్తూ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో అసిస్టెంట్ రిజిస్టార్లు, టెక్నికల్ ఆఫీసర్లు, గ్రేడ్-1 ఆఫీసర్లు, అసిస్టెంట్ పీఆర్ఒ తదితరులు ఉన్నారు. మిగిలిన వారికి సైతం మరో విడతలో పదోన్నతి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులకు మోక్షం కల్పించడంపై నిమ్స్ ఉద్యోగులు, నిమ్స్ నాన్ ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షుడు సత్యగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజ్కుమార్, నిమ్స్ తెలంగాణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజ్కుమార్, శ్రీనివాస్రావు, ఏ.శ్రీనివాస్రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు నిమ్స్ డైరెక్టర్ను కలిసి సన్మానించారు.