BRS | కంటోన్మెంట్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ను ఎట్టకేలకు అధిష్టానం దివంగత నేత కుటుంబానికే కేటాయించింది. మే 13న జరగనున్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నేతలతో ఆరా తీసిన కేసీఆర్ ఎట్టకేలకు అధికారికంగా నివేదిత పేరును బుధవారం వెల్లడించారు. దీంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా సాయన్న వర్గీయుల్లో ఒక్కసారిగా ఆనందోత్సహాలు మిన్నంటాయి. కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న, ఒకసారి గెలిచిన సోదరి లాస్యనందిత అక్కగా నివేదితను ఆశీర్వదిస్తారని ఆశాభావంతో ఉన్నారు. టికెట్ ప్రకటించిన నేపథ్యంలో కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్నకు వివాదరహితుడిగా కంటోన్మెంట్లో పార్టీలకు అతీతంగా మంచి పేరుంది. ఆయన మరణంతో ఒక్కసారిగా సాయన్న కుంటుంబం పట్ల సానుభూతి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం పలు సర్వేలలో సాయన్న కుమార్తె లాస్యనందిత వైపే మొగ్గు ఉండడంతో టికెట్ ఇచ్చింది. కానీ ఫిబ్రవరిలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత మృతిచెందింది. ఈ నేపథ్యంలో మే 13న జరగనున్న ఉప ఎన్నికల్లో సైతం సాయన్న కుటుంబం నుంచే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం నివేదితను అభ్యర్థిగా ఫైనల్ చేయడంతో కంటోన్మెంట్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండవ కూతురైన నివేదిత 2017 నుంచి తండ్రి సాయన్న వెంటే నడిచింది. 2018 ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాయన్న ఆరోగ్యం క్షీణించడంతో అంతా తానై ముందడుగు వేసింది. 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యనందిత గెలవడంలో కీలక ప్రాత పోషించింది. అయితే రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతితో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అనూహ్యంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేసులోకి వచ్చారు..
– గ్యాని నివేదిత, బీఆర్ఎస్ పార్టీ, కంటోన్మెంట్ అభ్యర్థి
తనపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇటీవల కాలంలో తన చెల్లెలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో తేరుకోలేకుండా ఉన్న తమ కుటుంబంపై కేసీఆర్ చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. తనకు టికెట్ కేటాయించడంలో నైతిక మద్దతు తెలిపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్రెడ్డి, సహా బోర్డు మాజీ సభ్యులు, జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సహకారం మరువలేనిది. ఎట్టి పరిస్థితుల్లో కంటోన్మెంట్పై గులాబీ జెండాను ఎగురవేస్తాం.
పేరు : గ్యాని నివేదిత
తల్లిదండ్రులు : సాయన్న-గీత
పుట్టిన తేదీ : 24-11-1983
పుట్టిన స్థలం : హైదరాబాద్
స్థిర నివాసం : హైదరాబాద్
కులం : ఎస్సీ
విద్యాభ్యాసం : 10వ తరగతి వరకు సెయింట్ ఆన్స్ హైస్కూల్ సికింద్రాబాద్, ఎస్ఆర్ నగర్లోని గౌతమిలో ఇంటర్మీడియెట్, బోజిరెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్.
చిరునామా : ప్లాట్ నంబర్-47, గృహలక్ష్మీ కాలనీ, కార్ఖానా, సికింద్రాబాద్