2024 సంవత్సరానికి ముగింపు పలికి.. 2025 ఏడాదికి స్వాగతం పలికింది భాగ్యనగరం. ఆట, పాటలతో కలర్ఫుల్ ఈవెంట్స్ జరుపుకుని సందడిగా కొత్త ఏడాదిలోకి నగరవాసులు కాలుమోపారు. మంగళవారం సాయంత్రం నుంచి నగరం సెలబ్రేషన్స్తో మార్మోగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నయాసాల్ జోష్లో పాలుపంచుకున్నారు. కుటుంబ సమేతంగా సందడిగా గడిపారు. కేక్లు కట్ చేసి విషెస్ చెప్పుకుంటూ పండుగలా 2025ను ఆహ్వానించారు. నగరంలోని పబ్లు, రెస్టారెంట్స్, హోటల్స్లలో కుర్రకారు చిందేసి ఎంజాయ్ చేశారు. స్టెప్పులతో ధూంధాంగా గడిపారు. నగరంలోని నెక్లెస్రోడ్డు, ట్యాంక్బండ్, చార్మినార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, మణికొండ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. టపాసులు కాల్చుతూ ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ నినాదాలు చేసి కొత్త ఆనందంలో మునిగితేలారు.
నగరంలో కాలనీ అసోసియేషన్లు, అపార్ట్మెంట్స్ల ఆధ్వర్యంలో ఫ్యామిలీ పార్టీలు చేసుకుని సందడిగా గడిపారు. సోషల్ మీడియాలో న్యూ ఇయర్ పోస్టులు హోరెత్తాయి. డీపీలుగా 2025ను అమర్చి విషెస్ పంచుకున్నారు. కేక్లు కట్ చేసిన వీడియోలను వైరల్ చేశారు. కొత్త ఏడాది-డెస్టినేషన్స్తో నిర్వర్తించబోయే తమ ప్రణాళికలను తయారు చేసుకున్నట్టు నెటిజన్లు పోస్టులు పెట్టారు. మరోవైపు విభిన్న రకాల కేక్లు అనేక ఆకృతుల్లో అలరించాయి. కొంతమంది తమ ఫొటోలతో కేక్లను తయారు చేయించుకుంటే.. మరికొందరు తమకు నచ్చిన ఫ్లవర్స్ డిజైన్లో రూపొందించుకున్నారు. అక్షరాలు, నంబర్లు ఇలా కేక్లను అందంగా డిజైన్ చేశారు.
నగరంలోని బిర్యానీ సెంటర్లు, బేకరీలు, ఐస్క్రీమ్ పార్లర్స్, కేక్ దుకాణాలు కస్టమర్లతో కళకళలాడాయి. న్యూ ఇయర్ పేరుతో కొత్తకొత్త ఫ్లేవర్స్ను కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని బిర్యానీ సెంటర్లు కొత్త ఏడాది కానుక అంటూ తగ్గింపు ధరలను ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట వరకు హోటళ్ల ముందు కస్టమర్లు బారులు తీరారు. మరికొన్ని చోట్ల ఆన్లైన్ ఆర్డర్స్ తెల్లవారుజాము వరకు అందాయి. నచ్చిన ఆహారం తెప్పించుకుని ఇంటి వద్దనే ఆరగించి సంబురాలు చేసుకున్నారు.
అర్ధరాత్రి నుంచే మగువలు ఇండ్లు, అపార్ట్మెంట్స్ ముందర ముగ్గులు వేయడానికి పోటీ పడ్డారు. తీరొక్క రంగులద్దుతూ ఆకట్టుకునేలా ముగ్గులు వేశారు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ ముగ్గులతో ఆహ్వానించారు. తెల్లవారుజాము వరకు కాలనీల్లో మహిళలంతా ఇండ్ల ముందర ముగ్గులు వేసుకున్నారు. నగరమంతా పండుగ వాతావరణం తలపించింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మర తనఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి ఫ్లైఓవర్లు మూసివేశారు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్లు చేపట్టారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహించేందుకు పబ్బులు, ప్రత్యేక కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. శివారుల్లోని ఫాం హౌజ్లు, రిసార్టులపై పోలీసులు దృష్టి సారించి.. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించారు.