సిద్ధమవుతున్న మరో ఫ్లై ఓవర్
ఇరువైపులా ప్రయాణించేలా నిర్మాణం
రూ.143.58కోట్ల వ్యయంతో.. 990 మీటర్లు
నాగోలు జంక్షన్లో యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న ఫ్లై ఓవర్ పనులు
ఎల్బీనగర్, ఏప్రిల్ 6 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్లో రెండు అండర్పాస్లు, ఒక ఫ్లై ఓవర్, బైరామల్గూడ జంక్షన్లో రెండు ఫ్లై ఓవర్లు, కామినేని జంక్షన్లో రెండు ఫ్లై ఓవర్లు , చింతలకుంట జంక్షన్లో ఒక అండర్పాస్ అందుబాటులోకి రాగా.. మరో ఐదు పనులు కొనసాగుతున్నాయి. వీటిలో ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్, బైరామల్గూడలో ఎడమవైపు లూప్ ఫ్లై ఓవర్, కుడివైపు లూప్ ఫ్లై ఓవర్, బైరామల్గూడలో రెండో లెవల్ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయి.
వీటితో పాటుగా నాగోలు జంక్షన్లో రెండువైపులా ప్రయాణించేలా ఫ్లై ఓవర్ పనులు వేగంగా సాగుతున్నాయి. నాగోలు జంక్షన్ ఫ్లై ఓవర్ విషయంలో స్థల సేకరణ, యుటిలిటీలతో పాటుగా నిర్మాణ వ్యయం పేర్కొనడం జరిగిందని ఎస్ఆర్డీపీ డీఈ కార్తిక్ తెలిపారు. నాగోలు జంక్షన్లో 990 మీటర్లు ఫ్లై ఓవర్ రూ. 143.58 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం నాగోలు జంక్షన్లో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే ఉప్పల్, ఎల్బీనగర్ మార్గంలో ఇన్నర్ రింగ్రోడ్డుతో పాటుగా నాగోలు కొత్తపేట ప్రధాన లింక్రోడ్డు మార్గంలోనూ ప్రయాణం ఇబ్బందులు లేకుండా సాగుతుంది.
రూ. 672 కోట్లతో నిర్మాణాలు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకంలో భాగంగా రూ.672 కోట్లతో ఎల్బీనగర్, చింతలకుంట, బైరామల్గూడ, కామినేని, నాగోలు జంక్షన్లలో అండర్పాస్, ఫ్లై ఓవర్లు నిర్మాణం జరుగుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది పనులు పూర్తయ్యాయి. మరో ఐదు పనులు నిర్మాణంలో ఉన్నాయి. నాగోలు జంక్షన్లో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్ని నిర్మాణాలు పూర్తయితే ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా తీరుతుంది. – దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్యే