ఆందోళనకు గురైన స్థానికులు
ఐదు గంటలు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, జీహెచ్ఎంసీ, మార్కెట్ పోలీసులు
బేగంపేట్, ఏప్రిల్ 6 : చింతచెట్టు మొదళ్ల మధ్య లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది చింతచెట్టు వద్దకు చేరుకుని సుమారు ఐదు గంటల పాటు శ్రమించి పొగలను ఆర్పివేశారు. ఈ సంఘటన సికింద్రాబాద్ 31 బస్టాప్లో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ 31 బస్టాప్ సమీపంలోని ఓ భారీ చింతచెట్టు మొదళ్ల మధ్యలో నుంచి బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగ లు వచ్చాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రిల్మిషన్ ద్వారా పొగ వచ్చే ప్రాంతంలో రంధ్రాలు చేసి అందులో నీరు పోశారు. దీంతో పొగలు రావడం ఆగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, జీహెచ్ఎంసీ, మార్కెట్ పోలీసులు సుమారు 5 గంటల పాటు శ్రమించారు. పొగలు రావడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.