సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : రానున్న వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సర్వం సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో పలు చోట్ల ప్రమాదం సంభవించడానికి ఏ మాత్రం అవకాశం ఉన్న పాత భవనాల గుర్తింపు అత్యంత కీలకమని, ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. శనివారం మంత్రి కార్యాలయంలో జీహెచ్ఎంసీ వర్షాకాల ఏర్పాట్లపై నగర ఎమ్మెల్యేలతో పాటు సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద నివారణ కార్యక్రమం ఎస్ఎన్డీపీ పై కూడా ఈ సమావేశంలో మంత్రిఅధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాలాల్లో పూడికతీతను తొలగించాలి..
వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన అన్ని రకాల పనులు జూన్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం నాటికే ఈ పనులు పూర్తికావడం వల్ల వరద ముంపు ప్రమాదాన్ని అరికట్టడానికి వీలు ఉంటుందన్నారు. ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఎస్ఎన్డీపీ పనుల పురోగతి పై అధికారులతో చర్చించారు. వర్షాకాలంలో కీలకమైన వాటర్ లాంగింగ్ (నీరు నిల్వడం) పాయింట్లు, రోడ్ల నిర్వహణ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ట్రాఫిక్, పోలీసులు, జీహెచ్ఎంసీ గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు శాశ్వత ప్రాతిపాదికన పనులు నిర్వహించాలని సూచించారు. వాటర్ వర్క్స్ పరిధిలోని వాటర్ సీవేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ, మ్యాన్హోళ్ల నిర్వహణపై శ్రద్ధ చూపాలన్నారు. వర్షాకాల సన్నద్ధత పనుల కోసం ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ విభాగంతో పాటు ఇతర విభాగాలు కలిసి సమన్వయంతో ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, నగర మేయర్, కమిషనర్తో పాటు ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.