సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): శివారు ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాల జోరు క్రమంగా పెరుగుతోంది. కోర్సిటీతో పోల్చితే ఔటర్ రింగ్రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు నివాసయోగ్యానికి అనుకూలంగా మారగా.. అక్కడ నిర్మాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్తో పోలిస్తే.. దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా 1,57,003 దరఖాస్తులు రాగా, అందులో రంగారెడ్డి జిల్లా నుంచి 35,759, మేడ్చల్ జిల్లా నుంచి 34,899, హైదరాబాద్ జిల్లా నుంచి 6960 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఇందులో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్(ఎంఎస్బీ)ల నిర్మాణాల కోసం హెచ్ఎండీకు ప్రతిరోజూ దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని.. కేవలం 2 నెలల వ్యవధిలోనే హెచ్ఎండీఏ పరిధిలోని శంకర్పల్లి, మేడ్చల్, శంషాబాద్, ఘట్కేసర్ జోన్ల పరిధిలో 30కి పైగా ఎంఎస్బీల కోసం దరఖాస్తులు వచ్చాయని ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు. ఐటీ కారిడార్లో ఉన్న శంకర్పల్లి జోన్లోనే(వెస్ట్జోన్)లో ఎక్కువ, ఆ తర్వాత మేడ్చల్, ఘట్కేసర్లు ఉండగా.. శంషాబాద్లో మాత్రం ఎంఎస్బీల కోసం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని ప్లానింగ్ అధికారులు తెలిపారు. దీనికి కారణం శంషాబాద్ ఎయిర్పోర్టు, త్రిబుల్ వన్ జీవో, నగరానికి ఎక్కువ దూరం ఉండడంతో ఎంఎస్బీల నిర్మాణానికి బిల్డర్లు ఆసక్తి చూపకపోవడమే.
శివారులోనే కావాల్సినన్ని భూములు..
భారీ బహుళ అంతస్థుల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎకరాల కొద్దీ స్థలాలు కావాలి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే చోట ఇంత స్థలం అందుబాటులో లేదు. దీంతో బిల్డర్లు గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డును కేంద్రంగా చేసుకొని ఎంఎస్బీలను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కావాల్సిన భూములను కొనుగోలు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి రంగంలోకి దిగుతున్నారు.
వెస్ట్ జోన్కు తగ్గని క్రేజ్
దేశంలోని ఐటీ కారిడార్ల పరంగా చూస్తే హైదరాబాద్లో గణనీయమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్లోని వెస్ట్జోన్ వైపు అనేక మంది కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. కారిడార్ విస్తరణతో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు క్రమంగా పెరగుతున్నాయన్న అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు, హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.