మేడ్చల్, నవంబర్7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అంటే కరువు అని.. బీఆర్ఎస్ అంటే భరోసా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్ వెంటే తాము ఉంటామని ముదిరాజ్లు స్పష్టం చేయడం సంతోషంగా ఉందన్నారు. ముదిరాజ్లతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశ్వీరదించాలన్నారు. రాజకీయాల్లో బీసీలు రాణించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేసిందని తెలిపారు. ఎండాకాలంలో నీళ్లతో నిండిన చెరువులను కాంగ్రెస్ హయాంలో ఎప్పడూ చూడలేదని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి జలశయాలు నిర్మించి కాలువల ద్వారా చెరువులను నింపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నిండిన చెరువులలో ముదిరాజ్లు చేపల పెంపకం చేపట్టి ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా చేపలను ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ చేప పిల్లలను ముదిరాజ్లకు అందజేస్తున్నదని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని.. అభివృద్ధిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డికి ముదిరాజ్ సంఘం సభ్యులు సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్కు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జిల్లా గ్రంథ్రాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్రెడ్డి, జిల్లా ముదిరాజ్ సంఘం రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు జగన్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్ ముదిరాజ్, ముదిరాజ్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సంఘం ప్రతినిధులు, ముదిరాజ్లు తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ రాష్ట్ర , జిల్లా కమిటీలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపడం అభినందనీయమని శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. తనను, బడుగుల లింగయ్య యాదవ్ను రాజ్యసభకు పంపించడం అంటే ఆషామాషి కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. పార్టీ మారిన వారి ఆరోపణలను పట్టించుకోవద్దని బండ ప్రకాశ్ ముదిరాజ్లకు సూచించారు. ముదిరాజ్లకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ను గుర్తు పెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.