ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: తార్నాక డివిజన్లో గత ఐదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత యాభై ఏళ్ల కాలంలో పరిష్కారం కాని ఎన్నో పనులను సైతం తాము స్వల్ప కాలంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు.
తార్నాక డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. లాలాపేట, లక్ష్మినగర్, ఇందిరానగర్, చంద్రబాబునగర్, తార్నాక ప్రాంతాల్లో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డిలతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబునగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామని, ప్రభుత్వపరంగా అనుమతి వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
అందులో జాప్యం జరిగితే రూ. కోటి తన సొంత నిధులతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. లాలాపేట ప్రాంతం నుంచి కనీసం 50 మందికి దళిత బంధు పథకంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు దశరథ్, డాక్టర్ రవీందర్గౌడ్, ఆశలత, డేవిడ్రాజు, కృష్ణప్రసాద్, వెంకటేశ్, గంగాధర్, యమున, రాజేశ్, టీఆర్ఎస్ యువనేత తీగుళ్ల రామేశ్వర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.