మన్సూరాబాద్, ఏప్రిల్ 2: అదానీ సంపదను పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సేల్స్ ప్రమోటర్గా మారిపోవడం దురదృష్టకరమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో కలిసి ఆదివారం ఎంఈరెడ్డి గార్డెన్లో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు జక్కిడి రఘువీర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ కుబేరుల్లో అదానీ 2020వ సంవత్సరంలో 609వ స్థానంలో ఉండే వాడని.. మూడు సంవత్సరాల్లోనే 606 స్థానాలు ఎగబాకి ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎలా రాగలిగాడని ప్రశ్నించారు. అదానీ ఆస్తులను పెంచేందుకు ప్రధాని మోదీ ప్రపంచ దేశాల వద్ద దేశ పరువును తాకట్టు పెట్టాడని విమర్శించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్బీనగర్, కొత్తపేట ఫ్రూట్మార్కెట్ స్థలంలో రూ. 1200 కోట్లతో టిమ్స్ దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ పూనుకొన్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో జీఓ నం. 118ని తీసుకువచ్చి సంవత్సరాల తరబడిగా ఎల్బీనగర్లోని నలబై కాలనీల్లో నెలకొన్న రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ సమస్యకు పరిష్కారం చూపామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, కర్మన్ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, తదితరులు పాల్గొన్నారు.