సికింద్రాబాద్, ఏప్రిల్ 14 ( నమస్తే తెలంగాణ ) : పద్మారావు గౌడ్ రాజకీయ జీవితంలో పార్సీగుట్టది ప్రత్యేకమైన పాత్ర. ఎన్నికలు ఏవైనా.. ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ సెంటిమెంట్ ప్రతీసారి వర్కవుట్ అవుతూనే ఉన్నది. ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పజ్జన్న..ప్రతి ఎన్నికల్లోనూ పార్సీగుట్టనే తొలుత ప్రచార ప్రాంతంగా ఎంచుకుంటారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రూ. 800 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు లోక్సభ బరిలో ఉన్నారు. ప్రజలతో ఉన్న అనుబంధం, అభిమానం కారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పద్మారావుగౌడ్ని పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచార పాదయాత్రను సోమవారం పద్మారావు ప్రారంభించనున్నారు.
ఎప్పటిలాగానే తనకు అన్ని విధాలా సెంటిమెంట్గా భావిస్తున్న పార్సీగుట్టనే లోక్సభ ఎన్నికల ప్రచారానికి కూడా వేదికగా చేసుకున్నారు. గతంలో 2004, 2014, 2018, 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్సీగుట్ట నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి విజయదుందుభి మోగించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో పార్సిగుట్ట నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ పాదయాత్రలో స్థానిక కార్పొరేటర్ శైలజతో పాటు నియోజకవర్గ కార్పొరేటర్లు ,పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. పద్మారావు అభిమానులు, బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
అందరివాడుగా గుర్తింపు పొందిన పజ్జన్నకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు జేజేలతో ఆహ్వానిస్తున్నారు. పజ్జన్న గెలుపు ఖాయమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో అభిమానాన్ని చాటుకుంటున్నారు. డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా అత్యున్నత పదవులు చేపట్టిన పద్మారావు.. ప్రజలతో అనుబంధాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఎలాంటి హోదాలో ఉన్నా.. ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. తెలంగాణ స్వరాష్ట్ర సాకారంలో ఉద్యమ రథ సారథి కేసీఆర్ ఆదేశాలతో కీలకపాత్ర పోషించారు. అప్పటి నుంచి కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలతో మమేకమయ్యారు. కాగా, ‘నమస్తే తెలంగాణ’తో పద్మారావు గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రతి ఎన్నికల్లో ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్న కేసీఆర్కు రుణపడి ఉంటానని పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని విమర్శించారు. కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి నిరంతరం శ్రమించే పార్టీ కేవలం బీఆర్ఎస్సే అని నినదించారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని, విజయం తథ్యమని చెప్పారు.