అబిడ్స్, మే 6 : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పద్మారావు గౌడ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్కుమార్ గౌడ్తో కలిసి నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లోని పలు ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. అనంతరం పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అదే విధంగా చేసిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సంసిద్దులై ఉన్నారన్నారు.
నాంపల్లి నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని, నాంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు భారీ మెజార్టీ లభించడం ఖాయమన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించిన పద్మారావు గౌడ్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మచ్చలేని నాయకుడిగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే పద్మారావును గెలిపించుకునేందుకు ప్రజలు సంసిద్దులై ఆయన పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.