TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్లోని బేగంపేట( Begumpet )లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు( Electric Bus )లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును ఆపేశారు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
టీఎస్ ఆర్టీసీ( TSRTC )కి చెందిన ఎలక్ట్రిక్ బస్సు బేగంపేట నుంచి ప్యారడైస్( Paradise ) వైపు వెళ్తుండగా ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. అగ్నికీలలు ఎగిసిపడిన వెంటనే బస్సు ఆపడంతో ప్రయాణికులందరూ బస్సు దిగేశారని పేర్కొన్నారు. బస్సు ముందు భాగం స్వల్పంగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.