ప్రభుత్వంలో విలీనమవుతున్న ఆర్టీసీ ఫుల్ జోష్లో పని చేస్తున్నది. గ్రేటర్ ఆర్టీసీకి సోమవారం రికార్డు రాబడి సమకూరింది. ఒక్కరోజే దాదాపు 12 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి, సిటీ బస్సులు 89 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. తద్వారా ఆర్టీసీకి గ్రేటర్ జోన్లో సోమవారం ఒక్క రోజే రూ. 5.10 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు ఆర్టీసీ చరిత్రలో ఇదే అత్యధికమని గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు త్వరలోనే మరిన్ని ఈవీ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
– సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): ఇటీవల టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలు ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నాయి. నగరంలో సిటీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజు రోజుకూ పెరుగుతూ బస్సు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా సిటీ బస్సుల ద్వారా ప్రతి రోజు దాదాపు రూ.4.50 నుంచి రూ.4.90 కోట్ల వరకు ఆదాయం నమోదవుతుంది. అయితే, సోమవారం (ఈ నెల 7న) రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైనట్లు గ్రేటర్ ఆర్టీసీలోని జోన్ అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 7న దాదాపు 89 శాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదైనదన్నారు. అలాగే, గతం వరకు 11 లక్షలకు పైనే సిటీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు.. సోమవారం ఒక్క రోజు 12 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సులను సద్వినియోగం చేసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే, నగరంలో సొంత వాహనాలు వీడి ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగడం శుభ సూచకమన్నారు. ఈ విజయం సాధించడానికి కండక్టర్లు, డ్రైవర్లు కృషి కారణంగా నిలుస్తున్నదని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ఇలాంటి రికార్డులను ఎంటినో బ్రేక్ చేయడానికి తాము శక్తివంచన లేకుండా పని చేస్తామన్నారు.
త్వరలోనే విద్యుత్ బస్సులు..
నగరంలో వాయు కాలుష్యాన్ని బాగా తగ్గించి ఆక్సిజన్ శాతాన్ని పెంచాలన్న లక్ష్యంతోనే నగరంలో వీలైనంత త్వరలోనే 600 వరకు విద్యుత్ బస్సులు వస్తున్నాయని, అందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసిన విషయాన్ని ఈడీ తెలిపారు. దానికి కొనసాగింపుగా మరో మూడు వారాలలో నగరంలో విద్యుత్ (ఈవీ) బస్సులు తిరుగనున్నాయన్నారు. అయితే, ప్రస్తుతం తొలి విడుతలో నగరానికి 25 విద్యుత్ బస్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందులో ఒక్క బస్సు నమూనాను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ బస్ భవన్ దగ్గరుండి పరిశీలించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. విద్యుత్ బస్సుల వల్ల నగరంలో సిటీ బస్సుల ద్వారా ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.