కాచిగూడ, మార్చి 1 : బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తున్నదని, త్వరలోనే కేంద్రంపై మిలిటెంట్ ఉద్యమాన్ని చేపడుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం బీసీ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో దేశంలో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం కాచిగూడ హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ అహింస మార్గంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమంలాగానే బీసీ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, అస్సాం, తదితర రాష్ర్టాలకు చెందిన లక్షలాది మంది బీసీ కార్యకర్తలతో పార్లమెంట్ను ముట్టడిస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్లో కేవలం 2 వేల కోట్లను కేటాయించి తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్రం వచ్చి 75 యేండ్లు దాటినా బీసీలకు ప్రజాస్వామ్యబద్ధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరగడంలేదని, దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ ప్రభుత్వం అణిచి వేస్తుందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, భూపేశ్సాగర్, వెంకటకిషన్, నీల వెంకటేశ్, కోలా జనార్ధన్, సి.రాజేందర్, ప్రశాంతి, నందగోపాల్, సుమన్, రాభిన్, నిఖిల్, అంతయ్య, శివయ్య, ఎల్.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.