దుండిగల్, సెప్టెంబర్ 22: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం కారణంగానే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినదని మేడ్చల్ జిల్లా భారత జాగృతి యువజన విభాగం అధ్యక్షురాలు, దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పడాల మనోజ ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవిత చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పటాకులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం, మనోజతో పాటు పలువురు మహిళలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన రాజీలేని పోరాటం కారణంగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఎమ్మెల్సీ కవితకు మహిళాలోకం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.