కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 11: జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా, స్పెషల్ ఆఫీసర్లను నియమించి రేవంత్రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నదని విమర్శించారు. స్థానిక సమస్యలను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రహస్య ఒప్పందాలతో నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించకుండా వాయిదా వేస్తూ అధికారుల ముసుగులో హైదరాబాద్ నగరాన్ని దోచుకోవడానికి ప్రభుత్వం ఒక దండుపాళ్యం ముఠాలా తయారైందని వ్యాఖ్యానించారు.