బేగంపేట్ డిసెంబర్ 7: జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించే విధంగా మరింత శ్రమించాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. అమీర్పేట్ డివిజన్ బల్కంపేటలో హనుమాన్ వ్యాయామశాలకు చెందిన యువకులు, విద్యార్థులు, ఇటీవల జరిగిన పోటీలలో బంగారు, వెండి పథకాలు సాధించారు. ఆదివారం వ్యాయామశాల నిర్వహకులు రాజు అధ్వర్యంలో వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పథకాలు సాధించిన వారిని ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తమ వ్యాయామ శాలకు చెందిన పలువురు వివిధ విభాగాల్లో పథకాలు సాధించారని రాజు ఎమ్మెల్యేకు వివరించారు. గత నెలలో జియాగూడలో నిర్వహించిన రెజ్లింగ్ పోటీలలో మణికంఠ 75 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్, 70 కిలోల విభాగంలో బన్నీ సిల్వర్ మెడల్ అదేవిధంగా పవర్ లిఫ్టింగ్లో శ్రవణ్కుమార్ గోల్డ్ మెడల్ సాధించినట్టు తెలిపారు. మిగిలిన వారు వివిధ రకాల మెడల్స్ సాధించారు. తమ వ్యాయామ శాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తూ అవసరమైన క్రీడా పరికరాలను అందిస్తూ క్రీడా కారులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, నాయకులు హన్మంతరావు, అశోక్యాదవ్, నర్సింహా, బలరాం, శ్రీనివాస్, హరిసింగ్ తదితరులు ఉన్నారు.