సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ
క్యాంపు కార్యాలయంలో మహిళలతో ఎమ్మెల్యే సాయన్న
సికింద్రాబాద్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు పలు పథకాలపై ఎమ్మెల్యే సాయన్నను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పథకాల అమలులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీలో అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే కంటోన్మెంట్లో సుమారు 4వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్షా 116లు అందించామని, సీఎంఆర్ఎఫ్ కింద సుమారు రూ. 20 కోట్ల వరకు బాధిత లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం సర్కారు సాయం అందినట్లు పేర్కొన్నారు.
అదే విధంగా దాదాపు రూ.135 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడం జరిగిందని, మరోవైపు రసూల్పురాలోని నారాయణ జోపిడి సంఘం బస్తీలో రెండు రోజుల క్రితమే రూ. 23కోట్లతో 296 డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన చేశామన్నారు. దీంతో పాటు మొదటి విడతలో భాగంగా దళిత బంధు పథకంలో 100 మంది లబ్ధిదారులకు పథకాన్ని అమలు చేశామన్నారు. రెండో విడతలో సుమారు 1500మంది దళితులకు పథకాన్ని అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, అర్హులైన వారికి పథకాలు చేరే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, హరికృష్ణ, ప్రభాకర్, భాస్కర్ ముదిరాజ్, సంతోష్, నిత్యానంద్, సాంబ అశోక్, పరుశ్రామ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.