సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : పదేండ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడంతోనే గ్రేటర్లో బీఆర్ఎస్కు గౌరవపద్రమైన స్థానాలను కట్టబెట్టారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు.
గ్రేటర్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. త్వరలోనే పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోదామని ఆయన సూచించారు. తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం ఎర్రవెల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి ఈ సందర్భంగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పి. కార్తిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– బడంగ్పేట్, డిసెంబర్ 4