బడంగ్పేట, జనవరి 4: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 58 మందికి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 44 మందికి, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 77 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఆమె అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా చొరవ తీసుకున్నారని, పక్షపాతం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పక్షపాతం లేకుండా అర్హులందరికీ చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, బడంగ్పేట, డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్, కమిషనర్లు సుమన్ రావు, వాని రెడ్డి, వసంత రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.