ఆర్కేపురం, జనవరి 8: తనమీద నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్కు మంజూరైన 51 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం సరూర్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్గుప్త, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి వృద్ధ్యాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను రూ.2 వేలకు పెంచారన్నారు. అదే విధంగా ఆడబిడ్డల ఆత్మగౌవరం పెంచేలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటీకీ నల్లాల ద్వారా నీరు అందించారని తెలిపారు.
ఎన్నికల సమయంలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరయ్యాయని, ఎన్నికల కోడ్ ఉండటంతో చెక్కులు అందించడం ఆలస్యమైందని వెంటనే బ్యాంకుల్లో జమ చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి నియోజకవర్గంలో 16వేల మందికి లబ్ధిచేకూరిందన్నారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్కు చెందిన 1800 మందికి అందించామన్నారు. ఇకముందు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందుకుంటారని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మూడో సారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానన్నారు.
గత ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తీసుకొచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు 1000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించామని, ఇంకా కొన్ని కేటాయించాల్సి ఉందని, కానీ కొంత మంది కోర్టులో కేసు వేయడంతో అవి ఆగిపోయాయని, త్వరలోనే కేసును వేకెట్ చేయించి మిగతావారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షడు పెండ్యాల నగేశ్, నాయకులు కొండ్ర శ్రీనివాస్, పెంబర్తి శ్రీనివాస్, కంచర్ల శేఖర్, సాజీద్, గోవర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు.