హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న తన భర్త ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించి, వసతులు కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన భార్య టి.ఉషాబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కన్నెగంటి లలిత గురువారం విచారణ జరిపారు.
ఈ కేసులో తమ వాదనలు తెలియజేసేందుకు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి కోరగా.. హైకోర్టు అనుమతించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్, సిటీ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.కరుణాసాగర్ వాదించారు. పోలీసుల వాదనల నిమిత్తం విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.