బాలానగర్, నవంబర్ 3 : అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి.. అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో రోడ్ షో నిర్వహించారు. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని కాలనీల సంఘాలు, బస్తీ సంఘాల ప్రతినిధులను కలిశారు. తాను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి.. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సంఘాల ప్రతినిధులు, మహిళలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, ఈ దఫా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అండదండలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
మాధవరం కృష్ణారావునే గెలిపిస్తామని శంకర్ ఎన్క్లేవ్, స్వర్ణదామనగర్, మైత్రీవన్కాలనీ, శ్రీసాయి ఎన్క్లేవ్, రాంరాజ్నగర్, ఆనంద్కాలనీ, గౌరీనగర్, సమతానగర్, హెచ్ఏఎల్కాలనీ, ఆర్ఆర్నగర్, ఆర్ఆర్ టౌన్ షిప్, టీచర్స్కాలనీ, పీవీ ఎన్క్లేవ్, సాయి నారాయణపురి కాలనీ, రాంరెడ్డి కాలనీ, వైశ్యా బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీ, బృందావన్కాలనీ, శాంతి నికేతన్కాలనీ, యాదిరెడ్డికాలనీ, తిరుమల కాలనీలతో పాటు పలు కాలనీల సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేసి హామీ ఇచ్చారు. తమ కాలనీల్లో ఏదైనా సమస్య ఉన్నదని తెలిపిన వెంటనే స్పందించి.. పని చేయగల నేత ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ నర్సింహయాదవ్ అని సంతోషం వ్యక్తం చేశారు.
మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో ఒక్క అభివృద్ధి పనైనా చేశాడా.. ఏనాడైనా ఇక్కడ కనిపించాడా.. అని ప్రజలను అడిగారు. పని చేసే వారిని ఆదరించండి… అభివృద్ధి చేస్తారు.. అని కోరారు. ఏమి చేయని వారికి ఓటు వృథా అన్నారు. తనకు ఓటువేసి బీఆర్ఎస్ను గెలిపిస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని, రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని కృష్ణారావు అన్నారు.