బంజారాహిల్స్,నవంబర్ 27: దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న వారిని నేరుగా కలిసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్ష పార్టీలు ప్రజలవద్దకు వస్తుంటాయని, టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ వారి కష్టనష్టాలో పాలుపంచుకుంటోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తల కృషితోనే తెలంగాణ రాష్ట ఏర్పాటుతో పాటు అధికారం దక్కిందన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలలో తాము పనిచేశామని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలోనూ ఇవ్వలేదన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడడంతో పాటు వారి సమస్యలను గురించి తెలుసుకుని సాయం చేసేందుకు డివిజన్ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని, అబద్ధ్దాలను ప్రచారం చేస్తున్న బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ కార్యకర్తలకు తగిన సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు.
ఈ సమావేశానికి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెల్దండ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రాంమ్మూర్తితో పాటు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు పలు కమిటీ నేతలు హాజరయ్యారు.