చర్లపల్లి, ఏప్రిల్ 17 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మద్దురి గార్డెన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి ఆధ్యక్షతన జరిగిన అత్మీయ సమ్మేళనానికి ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావులతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడంలో నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్న పాలనపై దేశ ప్రజలు అసక్తి చూపిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలో ఉప్పల్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని, గృహలక్ష్మి పథకంలో భాగంగా స్థలం ఉన్న వారికి మూడు దఫాలుగా మూడు లక్షల రూపాయలను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.దళిత బంధు పథకం అర్హులైన వారికి అందజేస్తున్నామన్నారు.